శుద్ధోదక స్నానం –
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు |
స్నానం ప్రకల్పయేత్తీర్థం సర్వపాప ప్రముక్తయే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్యమున వాసము చేయుచు మిగుల కష్టంబులను అనుభవించి యొకనాడు కృష్ణుని గాంచి “మహాత్మా! నేను తమ్ములతోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచు మిగుల కష్టము జెందియున్నవాడను, ఇట్టి కష్టసాగరము నందుండి కడతేరునట్టి ఉపాయమును జెప్పవలయు” నని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియె.
“ఓ ధర్మరాజా! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి యనంత వ్రతంబను నొక వ్రతము కలదు. మరియు నా యనంత వ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడొనర్పవలయును. అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగు” నని వచించిన ధర్మరాజు ఇట్లనియె.
“ఓ రుక్మిణీ ప్రాణవల్లభా! ఆ అనంతుడను దైవంబెవరు? అతండాదిశేషుడా! లేక తక్షకుడా! లేక సృష్టికర్తయైన బ్రహ్మయా? లేక పరమాత్మ స్వరూపుడా” యని అడిగిన శ్రీకృష్ణుం డిట్లనియె.
“ఓ పాండుపుత్రా! అనంతుడనువాడను నేనే తప్ప మరి యెవరును కాదు. సూర్యగమనముచే కళాకాష్ఠ ముహూర్తములనియు, పగలు రాత్రియనియు, యుగ సంవత్సర ఋతు మాసకల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలంబేది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను కృష్ణుని గాను, విష్ణుని గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగను, సృష్టిస్థితిలయ కారణభూతునిగను, అనంతపద్మనాభునిగను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగను నెరుంగుము. ఏ నాహృదయమందే పదునాలుగు రింద్రులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులను, సప్తర్షులను, సరిదద్రిద్రుమములును, భూర్భువస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీ కెరింగించితి”ననిన ధర్మరాజు కృష్ణమూర్తిం గాంచి “ఓ జగన్నాథా! నీవు వచించిన అనంత వ్రతంబెటు లాచరింపవలయును? ఆ వ్రతం బాచరించిన నేమి ఫలము గలుగును? ఏయే దానములం చేయవలయును? ఏ దైవమును పూజింపవలయును? పూర్వం బెవరీ వ్రతం బాచరించి సుఖము జెందిరి?” అని యడిగిన కృష్ణమూర్తి యిట్లనియె.
“ఓ ధర్మరాజా! చెప్పెద వినుము. పూర్వయుగములందు వసిష్ఠగోత్రోద్భవుండును, వేదశాస్త్రార్థ సంపన్నుడును నగు సుమంతుడను నొక బ్రాహ్మణుండు కలడు. అతనికి భృగుమహాఋషి పుత్రికయగు దీక్షాదేవియను భార్య కలదు. ఆ దీక్షాదేవితోడ సుమంతుడు చిరకాలము కాపురము సేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు నొక కన్యను గనెను. ఆ బాలికకు శీల యను నామకరణం బొనర్చిరి.
ఇట్లుండ కొన్ని దినంబులకు దీక్షాదేవి తాపజ్వరంబుచే మృతినొందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను నొక కన్యను వివాహము జేసికొనెను. ఆ కర్కశ మిగుల కఠినచిత్తురాలుగను, గయ్యాళిగను, కలహకారిణిగను నుండెను. ఇట్లుండ ప్రధమభార్య యగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచు, గోడలయందును, గడపలయందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థలములయందు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టుచు దైవభక్తిగలదై యుండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయుచుండ కౌండిన్య మహాముని కొన్నిదినంబులు తపస్సుజేసి, పిదప పెండ్లి చేసుకొనవలయునను ఇచ్ఛగలిగి దేశదేశములం దిరుగుచు ఈ సుమంతుని గృహంబునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహాముని నర్ఘ్యపాద్యాదులచే పూజించి శుభదినంబున తన కూతురగు శీలనిచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైన బహుమానం బియ్యవలయునని తలంచి తన భార్యయగు కర్కశ యొద్దకుపోయి “ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైన బహుమానం బియ్యవలయును గదా! ఏమి ఇయ్యవచ్చు” నని యడుగగనే యా కర్కశ చివుక్కునలేచి లోపలికింబోయి తలుపులు గడియవేసికొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను. అంత సుమంతుడు మిగుల చింతించి దారిబత్తెంబునకైన నియ్యక బంపుట యుక్తము కాదని తలంచి పెండ్లికి చేయబడి మిగిలియుండెడు పేలపుపిండి నిచ్చి యల్లునితోడ కూతురును బంపెను. అంత కౌండిన్యుండు సదాచార సంపన్నురాలగు భార్యతోడ బండినెక్కి తిన్నగా తన యాశ్రమంబునకు బోవుచు మధ్యాహ్న వేళయైనందున సంధ్యావందనాది క్రియలు సల్పుటకై బండిదిగి తటాకంబునకేగెను. నాటి దినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున నచ్చోట నొక ప్రదేశమునందు అనేకమంది స్త్రీలు ఎర్రని వస్త్రంబులం ధరించుకొని మిగుల భక్తియుక్తులై వేర్వేరుగా అనంతపద్మనాభ స్వామిని పూజ సేయుచుండగ కౌండిన్యుని భార్యయగు శీల యది చూచి మెల్లగా ఆ స్త్రీలయొద్దకు బోయి, “ఓ వనితామణులారా! మీరే దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తరంబుగా నానతీయవలయు” నని ప్రార్థించగా, యప్పతివ్రత లిట్లనిరి.
“ఓ పుణ్యవతీ చెప్పెదము వినుము. ఇది అనంతపద్మనాభస్వామి వ్రతము. ఈ వ్రతంబు గాంచిన అనంత ఫలంబు లభించును. మరియు భాద్రపద శుక్ల చతుర్దశినాడు నదీ తీరంబునకుపోయి స్నానం బొనర్చి శుభ్ర వస్త్రములం గట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే నలికించి సర్వతోభద్రంబను ఎనిమిది దళములుగల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి, యా మండలమునకు చుట్టును పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులంబెట్టి ఆ వేదికకు దక్షిణపార్శ్వంబున ఉదకపూరిత కలశంబు నుంచి యా వేదికనడుమ సర్వవ్యాపకుండయిన అనంత పద్మనాభస్వామిని దర్భతో నొనర్చి యం దావాహనము చేసి, శ్వేత ద్వీపవాసిగను, పింగళాక్షుండుగను, సప్తఫణసహితుండుగను, శంఖ చక్ర గదా ధరుండుగను ధ్యానముచేసి, కల్పోక్తప్రకారముగ షోడశోపచార పూజ లొనర్చి, ప్రదక్షిణ నమస్కారములం గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో దడిసిన క్రొత్తదోరంబును ఆ పద్మనాభస్వామి సమీపమున నుంచి పూజించి అయిదుపళ్ళ గోధుమపిండితో నిరువదియెనిమిది యతిరసములం జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానములిచ్చి తక్కిన వానిని తాను భుజింపవలయును. మరియు పూజాద్రవ్యములన్నియు పదునాలుగేసిగా నుండవలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభస్వామిని ధ్యానించుచు నుండవలయును. ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తము సేయవలయు” నని చెప్పిన కౌండిన్యముని భార్యయగు శీల తక్షణంబున స్నానం బొనర్చి యా స్త్రీల సహాయము వలన వ్రతము నాచరించి తోరము గట్టుకొని దారి బత్తెమునకుగాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి, తానును భుజించి, సంతుష్టయై, భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండెనెక్కి యాశ్రమమునకుం బోయెను.
అంత శీల అనంతవ్రతం బాచరించిన మహాత్మ్యము వలన నాశ్రమంబెల్ల స్వర్ణ మయముగాను, గృహం బష్టైశ్వర్య యుక్తముగను నుండుటం గాంచి దంపతులిరువురును సంతోషభరితులై సుఖముగ నుండిరి. శీల, గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణఖచిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములం గావించుచుండెను.
అట్లుండ నొకనాడు దంపతు లిరువురుం గూర్చుండియుండగ దురాత్ముండగు కౌండిన్యుండు శీల సందిటనుండు తోరముం జూచి ‘ఓ కాంతా! నీవు సందియం దొక తోరము గట్టుకొనియున్నావు గదా! అదెందుల కొరకు కట్టికొని యున్నావు? నన్ను వశ్యంబు చేసికొనుటకా లేక మరియొకరిని వశ్యంబు చేసికొనుటకు గట్టుకొన్నావా’ యని యడిగిన నా శీల యిట్లనియె.
“ఓ ప్రాణనాయకా! అనంతపద్మనాభస్వామిని ధరించియున్నాను. ఆ దేవుని యనుగ్రహంబు వలననే మనకీ ధనధాన్యాది సంపత్తులు గలిగి యున్న” వని యథార్ధము వచించిన కౌండిన్యుండు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి యనంతుడనగా నే దేవుండని దూషించుచు నా తోరమును త్రెంచి భగభగ మండుచుండెడు అగ్నిలో బడవైచెను. అంత నా శీల హాహాకారం బొనర్చుచు పరుగెత్తిపోయి యా తోరమును తీసుకొనివచ్చి పాలలో దడిపి పెట్టెను.
పిదప గొన్ని దినంబులకు కౌండిన్యుం డిట్టి యపకృతి యొనర్చి నందువలన నతని ఐశ్వర్యంబంతయు నశించి గోధనములు దొంగలు పాలుగను, గృహమగ్ని పాలుగను ఆయెను. మరియు గృహమునం దెచటెచట పెట్టిన వస్తువులు అచటచటనే నశించెను. మాటలాడంబోయిన చోట నెల్ల కలహము సంభవించెను. ఎచ్చోటికిం బోయిన నెవరును మాటలాడరైరి.
అంత కౌండిన్యుండు ఏమియుం దోచక దారిద్ర్యముచే పీడింపబడుచు వనగహ్వరంబు ప్రవేశించి క్షుద్బాధాపీడితుండయి అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు గలిగి అమ్మహాదేవు నెట్లు చూడంగలనని మనంబున ధ్యానించుచు పోయిపోయి ఒకచోట పుష్పఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై నొక పక్షియై నను వ్రాలకుండుటం గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో నిట్లనియె: ఓ వృక్షరాజమా! అనంతుడను నామంబుగల దైవమును చూచితివా? యని యడిగిన నా వృక్షము నే నెరుంగనని చెప్పెను.
అంత కౌండిన్యుండు మరికొంత దూరముపోయి పచ్చిగడ్డిలో నీవలనావల తిరుగుచున్న దూడతోడం గూడిన ఒక గోవును గాంచి, ఓ కామధేనువా! అనంత పద్మనాభస్వామిని చూచితివా యని అడిగిన నదియు తానెరుగనని చెప్పెను.
పిమ్మట మరికొంత దూరము పోగా నొకచోట రమ్యంబై మనోహరంబైన రెండు కొలంకులు తరంగంబులతోడం గూడియును కమల కల్హార కుముదోత్పలంబులతోడం గూడియును, హంసకారండవ చక్రవాకాదులతోడం గూడియును, ఒక కొలను నుండి జలంబులు మరియొక కొలనికి పొరలు చుండుటయును గాంచి, ఓ కమలాకరంబులారా! మీరు అనంతపద్మనాభస్వామిని చూచితిరా యని అడిగెను, అందులకు ఆ పుష్కరిణులు మే మెరుగమని చెప్పగా, కౌండిన్యుండు మరికొంత దూరము పోగా నొకచోట నొక గాడిదయును ఒక యేనుగును నిలుచుకొని యుండెను. వానిం జూచి మీరు అనంతపద్మనాభస్వామిని జూచితిరా యని అడిగెను. అవి అనంతపద్మనాభస్వామి యెవరో మే మెరుంగమని చెప్పెను.
అంత కౌండిన్యుండు మిగుల విషాదంబునొంది దుఃఖాక్రాంతుడై మూర్ఛవోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి “ఓ విప్రోత్తమా! ఇటు ర”మ్మని పిలిచికొని తన గృహంబు నకు కొంపోయెను. అంత నా గృహము నవరత్న మణిగణ ఖచితంబుగను, దేవాంగనల తోడం గూడియు నుండుటుంగాంచి యాశ్చర్యంబు నొందియుండ, సదా గరుడ సేవితుండుగను, శంఖచక్రధరుండుగను నుండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన, కౌండిన్యుండు సంతోష సాగరమగ్నుండై భగవంతుని అనేక విధంబుల స్తోత్రము చేసిన, అనంత పద్మనాభస్వామి మిగుల సంతుష్టుండై ‘ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంతసించితిని. నీకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభవించకుండునటులను, అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము గలుగునట్లును వరము నిచ్చితి’ననిన కౌండిన్యుండు ఆనందాంబుధిం దేలుచు ఇటులనియె-
“ఓ జగన్నాథా! నే తోవలో చూచిన ఆ మామిడిచెట్టు వృత్తాంతమేమి? యా ఆవు ఎక్కడిది? ఆ వృషభంబు ఎక్కడినుండి వచ్చె? ఆ కొలను విశేషంబేమి? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వ”రని అడిగిన భగవంతు డిట్లనియె-
“ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను జదువుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్యచెప్పక పోవుటచే అడవిలో ఎవరికిని నుపయోగించని మామిడిచెట్టుగా జన్మించెను. తొల్లి యొకండు మహాభాగ్యవంతుడై యుండి తన జీవితకాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. ముందొక రాజు వృషభంబై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ధర్మం బొకటి యధర్మం బొకటి యని ఎరుంగుము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు నుండినందున గాడిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన నాతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కాన నీవు ఈ యనంతవ్రతంబును పదునాలుగు సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానము నిచ్చెద”నని వచియించి భగవంతుడు అంతర్ధానము నొందె.
పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద లనుభవించి యంత్యకాలంబున నక్షత్రమండలంబు చేరెను.
“ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుండు నక్షత్ర మండలంబు నందు కానంబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు నాచరించి లోకంబునం బ్రసిద్ధి పొందెను. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతం బొనర్చి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి యత్యంబున స్వర్గముం బొందిరి. కావున నీవ్రత కథను సాంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబుల ననుభవించి పిదప ఉత్తమ పదంబును బొందుదురు.” అని శ్రీకృష్ణుండు చెప్పెనని సూతమహాముని పలికి ముదమందె.